- వసంత పంచమి ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై నిరసన
- బాసర ఆలయంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్
- గోదావరి ఘాట్లను శుభ్రం చేసిన కార్యకర్తలు
Basara Temple: వసంత పంచమి వేళ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రభుత్వ వైఖరి పై మండిపడ్డారు. తమ పుణ్యక్షేత్రాన్ని తామే కాపాడుకుంటామని స్వచ్ఛభారత్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పిలుపుతో ముథోల్ నియోజకవర్గం నుంచి పెద్ద మొత్తంలో బీజేపీ కార్యకర్తలు బాసర అమ్మవారి క్షేత్రానికి చేరుకున్నారు.
శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఘాట్ల వద్ద ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. ఎమ్మెల్యే వారితో కలిసి పనిచేయడంతో పాటు అక్కడే మధ్యాహ్నం వరకు ఉన్నారు. కార్యకర్తలతో కలిసి ఘాట్ల వద్ద భోజనం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక రావడంతో ఆయా గ్రామాల పంచాయతీ కార్మికులు, బాసర పంచాయతీ కార్మికులు పారిశుధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే రామారావు పటేల్ పిలుపునిచ్చిన స్వచ్ఛభారత్ తో బాసర గోదావరి ఘాట్లు శుభ్రమై, నది తీరాన కొత్త కళ వచ్చింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారు పుట్టిన రోజైన వసంత పంచమి వేళ ఏర్పాట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. హిందువుల పండుగ అంటే చిన్న చూపా, అని మండిపడ్డారు. ఆలయ అధికార యంత్రాంగం పనితీరు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క పిలుపుతో కదిలి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇకనైనా బాసర ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపకూడదన్నారు. పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఇదే పరిస్థితి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం బాసర ఆలయ అభివృద్ధిపై దృష్టి సాధించాలని కోరారు.
– శెనార్తి మీడియా, బాసర
