- న్యాయాన్ని పరిరక్షించే వాళ్లపై దాడులు సమాజానికి చేటు
- జడ్జిలు, అడ్వకేట్లపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు?
- కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి
Lawyers’ protest: ‘రాష్ట్రంలో, దేశంలో నిత్యం ఏదో ఒకచోట న్యాయవాదులపై, న్యాయమూర్తుల దాడులు జరగడం బాధాకరం. ఈ దాడులు న్యాయ వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయేలా చేయడమే కాకుండా న్యాయవ్యవస్థనే అవమానించేలా నేరప్రవృత్తి ఉన్న కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఈ దాడులను అరికట్టాలంటే కఠినమైన న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి’ అని కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి (Beathi Mahendar reddy) డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో 9వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు మహిళా న్యాయమూర్తి పై గురువారం కరణ్ సింగ్ అనే కరడుగట్టిన నేరస్థుడు దాడి చేయడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాదులు(Advocates) విధులను బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ న్యాయాన్ని పరిరక్షించే వాళ్లపై నిత్యం దాడులు చేయడం సమాజానికి మంచిది కాదని, సమాజంలో ఒక న్యాయవ్యవస్థ పైనే నమ్మకం ఉందనే విషయం ప్రభుత్వాలు గమనించాలని, దాడులు ఇలాగే జరుగుతుంటే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోతుందన్నారు. కొంతమంది వ్యవహరిస్తున్న తీరును ప్రభుత్వాలు గమనించి అరికట్టే విధంగా న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాల్సిందేనని బేతి మహేందర్ రెడ్డి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టీ.రఘువీర్, లైబ్రరీ సెక్రటరీ కే. రాజేందర్, సేనియర్, జూనియర్ కార్యవర్గ సభ్యులు సుంకే దేవకిషన్, బెజ్జంకి శ్రీకాంత్ తో పాటు పెంచాల ప్రభాకర్ రావు, సిరికొండ శ్రీధర్ రావు, బలరాం, సంపత్, రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.