Lok Adalat : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతమైంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 9,642 కేసులు రాజీ కుదిరాయి. ఈ సందర్భంగా రామగుండం సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ, వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో చాలా వరకు రాజీదశకు చేరాయని, కొన్నింటి విషయంలో బాధితులకు న్యాయం జరిగిందని చెప్పారు.
ఈ లోక్ అదాలత్లో డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కేసులు, ఇంకా ఇతర చిన్న కేసులు పరిష్కరించబడ్డాయి. అంతేకాక, సైబర్ క్రైమ్ కేసుల్లో 82 బాధితులకు రూ. 8,58,716 పరిహారం అందించారు.
కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు గత 15 రోజులుగా కక్షిదారులతో సంప్రదింపులు జరిపి రాజీ దిశగా చైతన్య కల్పించారని సిపి తెలిపారు. టార్గెట్ను మించి కేసులు పరిష్కరించినందుకు పోలీసు సిబ్బందికి, కోర్టు అధికారులకు ప్రత్యేక రివార్డులు అందజేస్తామని చెప్పారు. లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల