- ప్రతి ఒక్క అధికారి ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయాలి
- బాల కార్మిక వ్యవస్థ ను రూపు మాపుదాం
- రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
Operation Smile: ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా జనవరి ఒకటో తేదీ నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ -11ను ను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసి విజయవంతం చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అధికారులను కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో సీపీ అధ్యక్షతన గురువారం వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడారు. ఆపరేషన్ స్మైల్ -11 లో పాలుపంచుకొంటున్న ఒక్క అధికారి ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయాలనీ కోరారు. ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనదని, దానిని అనుభవించడం ప్రతీ పౌరుని హక్కు అని అన్నారు. కానీ క్షణికావేశంలో కొందరు పిల్లలు తొందరపాటులో చిన్న చిన్న విషయాలకే తల్లి దండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిని ప్రమాదకరమైన పనులు చేయిస్తూ వారి జీవితాలతో చిన్నాభిన్నం చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తప్పి పోయిన పిల్లలను వెతికి ‘దర్పణ్ ‘ అప్లికేషన్ ద్వారా వారిని గుర్తించాలని, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచాలన్నారు. వారిని తిరిగి తల్లి దండ్రుల వద్దకు చేర్చి వారి శోకాన్ని తీర్చాలని అన్నారు. భిక్షాటన చేస్తున్న వారి గురించి, బాలకార్మికుల గురించి ఎప్పటి కప్పుడు సమాచారం ఇవ్వడానికి చైల్డ్ హెల్ప్ లైన్ కు చెందిన 1098,112 నెంబర్ల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ప్రతీ పోలీస్ డివిజన్ స్థాయిలో ఒక సబ్-ఇన్స్పెక్టర్ తో పాటుగా ఒక మహిళా పోలీస్ అధికారి, నలుగురు సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో నెల రోజుల పాటు ఇదే పనిపై ఇటుక బట్టి లు, వివిధ రకాల పరిశ్రమలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబాలకు దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించాలని అన్నారు. స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లి దండ్రులకు నచ్చ చెప్పి తిరిగి వారిని పాఠశాల కు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని అన్నారు.
సమావేశం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు, ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ఎస్ఐ రాజేష్, శైలజ, లచ్చన్న, శరణ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ శ్రీధర్, డీఎంహెచ్వో అన్నప్రసన్న కుమారి, లేబర్ ఆఫీసర్- హేమలత, సత్యనారాయణ, డీసీపీవో కమలాకర్, ఆనంద్, పీవో జితేందర్, డీఈవో సెక్టార్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, అజీముద్దీన్ దబీర్, సంజీవయ్య, లీగల్ ప్రొబేషనరీ ఆఫీసర్- రజిత, చైల్డ్ లైన్- ఉమాదేవి, రమాదేవి, ప్రవీణ్ కుమార్, సభ్యులు -శ్యామ్ సుందర్, సుమలత, సబ్ డివిజనల్ ఇన్చార్జి , టీం సభ్యులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల