Seed Agencies
Seed Agencies

Seed Agencies: సీడ్ ఏజెన్సీల దోపిడి

  • రైతులకు బోనస్ ఎగవేత…
  • నయా దందాకు తెరలేపిన మిల్లర్లు

Seed Agencies: వరి పంట సాగు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తే బస్తాకు రెండు నుంచి మూడు కిలోలు కోతలు పెట్టి అడ్డగోలుగా దోచుకుంటున్న రైస్ మిల్లర్ల భారీ నుంచి తప్పించుకునేందుకు రైతులు సీడ్ వడ్లు సాగుచేసైనా లబ్ధిపొందుతామంటే ఇక్కడ కూడా మోసానికి గురికాక తప్పడం లేదు. సీడ్ సాగు చేసిన రైతులకు బోనస్‌ చెల్లిస్తామని నెల రోజుల కిందటే సన్న వడ్లు సేకరించిన మిల్లర్లు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియవచ్చింది… జిల్లా వ్యాప్తంగా రైతులకు పంగనామం పెట్టేందుకు కుట్రలు జరుగుతుండగా హుజురాబాద్ డివిజన్ లో మాత్రం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

లాభం సీడ్ మిల్లర్లకే….
సీడ్ విత్తనాలు పండించిన రైతులకు బోనస్ ఇవ్వకుండా ఎగనామానికి ప్రయత్నిస్తున్న మిల్లర్లు విత్తన బ్యాగుల మీద క్వింటాలుకు రూ. 600 లాభంతో విక్రయిస్తున్నారు. సాధారణంగా రైతుల నుంచి సేకరించిన సన్న రకం ధాన్యాన్ని శుద్ధి చేసి 25 కిలోల చొప్పున బ్యాగులలో నింపి బస్తాకు కొంత లాభం చూసుకొని వ్యాపారులు ధర నిర్ణయించి విక్రయిస్తుంటారు. గత ఏడాది 25 కిలోల విత్తన సంచిని లోకల్‌ మార్కెట్లో రూ. 900 నుంచి రూ. 950 వరకు అమ్మగా ఇతర రాష్ట్రాలకు రూ. 1249 ధర ముద్రించి విక్రయించారు. గత ఏడాది బోనస్‌ ప్రకటించలేదు, ఈ ఏడాది ప్రభుత్వం బోనస్‌ ప్రకటించింది. దీనితో రైతులు సీడ్‌ మిల్‌ యజమానులతో ప్రభుత్వం ఇస్తున్నట్టు బోనస్‌ ఇవ్వాలని, క్వింటాలుకు రూ. 2820 చెల్లిస్తేనే ధాన్యం విక్రయిస్తామని చెప్పడంతో సీడ్‌మిల్‌ యజమానులు ధర పెంచారు. వ్యాపారులకు 25 కిలోల విత్తన సంచికి ధర పెంచి రూ. 1449 గా నిర్ణయించారు. ఇతర రాష్ట్రాలకు పంపించే విత్తన సంచిపై అటు ఇటుగా దాదాపు ఇదే ధరకు సరఫరా చేశారు. స్థానిక మార్కెట్లో మాత్రం 25 కిలోల బస్తాను రూ. 1050 నుంచి రూ. 1100 వరకు విక్రయించారు. అంటే క్వింటాలుకు రూ. 600 లాభంతో అమ్మకాలు సాగిస్తున్నారు. కానీ రైతులకు ఇచ్చే బోనస్ మాత్రం చెల్లించడం లేదు. రైతులకు బోనస్ చెల్లించకుండా, విక్రయించే సమయంలో మాత్రం బోనస్‌తో కలిపి విత్తనాలు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు.

రైతులకు బోనస్ ఎగవేతకు యత్నం…
సీడ్ విత్తనాలు సాగు చేసిన వారికి మిల్లర్లు బోనస్ ఎగవేతకు కుట్రలు పన్నుతున్నారని రైతులు వాపోతున్నారు. ముందుగా క్వింటాలుకు రూ. 2820 ఇస్తానని చెప్పి ఇప్పుడేమో తగ్గించి ఇస్తానంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడ్‌ వ్యాపారులు ధర విషయంలో కొరివి పెడుతుండటంతో రైతులు ఆగమాగమవుతున్నారు. ఓ వైపు అమ్మిన వడ్లకు డబ్బులు ఇవ్వకుండా నెలల తరబడి జాప్యం చేస్తుండగా మరోవైపు బోనస్ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.. రైతులు రెండు విధాలా నష్టపోతున్నారు. అత్యవసరమై డబ్బులు అడిగితే ఎంతో కొంత ముట్టజెప్పే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. క్వింటాల్‌కు రూ. 2820 బదులు రూ. 2500 మాత్రమే ఇస్తామని అంటున్నారని, మరి కొందరు వ్యాపారులైతే కేవలం మద్దతు ధర రూ. 2,320 ఇస్తామంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్‌ డివిజన్‌లో సీడ్‌ మిల్లు వ్యాపారుల నయా దందా తెరపైకి వస్తుంది. బోనస్‌ చెల్లిస్తామంటూ రైతుల నుంచి నెల రోజుల క్రితం నుంచే సన్న వడ్లు సేకరించి.. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా దోచుకునే ప్రయత్నం కనిపిస్తుంది.

అధికారులు చొరవ చూపితేనే…
జిల్లాలో అధికంగా హుజూరాబాద్‌ డివిజన్‌ లోనే సీడ్‌ వరి సాగవుతుంది. ఇక్కడ పండిన సన్న వడ్ల విత్తనాలకు క్వాలిటీ పరంగా ఇతర రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. ఏటా ఇక్కడి సీడ్‌మిల్లు వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం సేకరించి, మిల్లుల్లో శుద్ధి చేసి విత్తనాలుగా విక్రయిస్తుంటారు. ఈ ఏడాది యాసంగిలోనూ సాగు చేసిన వరిలో సగానికిపైగా విత్తనాల కోసం ధాన్యం సేకరించారు. అయితే, ప్రభుత్వం సన్నాలకు రూ. 500 బోనస్‌ ఇస్తానని ప్రకటించడంతో మద్దతు ధర రూ. 2,320కు బోనస్‌ కలిపి రూ. 2,820 ఇస్తామని చెప్పి సుమారు 2వేల మంది రైతుల నుంచి 40 వేల టన్నుల వరకు ధాన్యం తీసుకున్నారు. డబ్బులు అత్యవసరమున్న కొందరు రైతులకు క్వింటాలుకు రూ. 2500 చొప్పున చెల్లించగా మిగతా రైతులకు ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. బోనస్‌తో కలిపి విత్తనాల ధర నిర్ణయించి విక్రయించడం మొదలు పెట్టిన వ్యాపారులు రైతులకు మాత్రం మొండి చేయిచూపే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు బోనస్ (bonus) ఇవ్వకుండా.. విత్తన(seed) ప్యాకెట్లను బోనస్‌కు కలిపి విక్రయిస్తూ డబుల్ లాభం పొందుతున్నారు. జిల్లా కలెక్టర్ గాని, సంబంధిత అధికారులు చొరవ చూపితే తప్పా రైతులకు న్యాయం జరిగేట్టు లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *