Udaypur Declaration
Udaypur Declaration

Udaypur Declaration: ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఉత్తుత్తిదే!

  • తీర్మానాలకూ కట్టబడని కాంగ్రెస్
  • ‘ఒక కుటుంబం-ఒక టికెట్’ బుట్టదాఖలు
  • అధిష్టానం నిర్ణయాలకూ విలువేది అంటున్న హస్తం కార్యకర్తలు
  • స్వపక్షంలోనే విమర్శలు వెల్లువ
  • కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ ఆగ్రహం
  • మంచిర్యాల కాంగ్రెస్ లో రగులుతున్న మంత్రి పదవి చిచ్చు

Udaypur Declaration: కాంగ్రెస్ పార్టీ చేసిన తీర్మానాలు బుట్టదాఖలవుతున్నాయి. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు సైతం అమలుకాకపోతుండడంతో హస్తం కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మాటలకే పరిమితమవుతుండటంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది. 2022లో ఉదయ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ‘నవ్ సంకల్ప్’ చింతన శిబిరంలో తీసుకున్న ‘ఒక కుటుంబం-ఒక టికెట్’ సూత్రాన్ని విస్మరిస్తుండడంతో కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతున్నారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉంటే పదవుల పంపకాల్లో మాత్రం వలస నేతలకు పెద్దపీట వేస్తుండడంపై మండిపడుతున్నారు. ఆర్థికంగా చితికిపోవడంతో పాటు రాజకీయంగా అవకాశాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని గట్టెక్కించిన వారిని పక్కన పెట్టి జంపింగ్ జపాంగ్‌లకు పదవులు ఇవ్వడాన్ని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి పదవి కేటాయింపు మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు మరింత అంతర్గత కుమ్ములాటలకు మరింత ఆజ్యం పోసింది. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జెండా మోసిన నాయకులకు కాకుండా, కండువా మార్చిన నేతలకు మంత్రి ఫదవి ఇవ్వడంతో అసమ్మతి నిప్పు రాజుకుంటుంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు అధిష్టానం మంత్రి పదవి కేటాయించడంతో మంచిర్యా ల నియోజకవర్గ శ్రేణుల్లో కలకలం రేపింది.

పీఎస్సార్ వన్ మ్యాన్ షో..
మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ జిల్లాలో హస్తం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నాడు. తన వెన్నంటి ఉన్న వారితో పాటు ఉమ్మడి జిల్లాలోని కార్యకర్తలను కాపాడుకున్నాడు. పార్టీ కష్టకాలంలో ఆదుకున్న ప్రేమ్‌సాగర్ రావు తీరుతెన్నులను కార్యకర్తలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా దానిని సక్సెస్ చేయడంలో పీఎస్సార్ తర్వాతే ఎవరైనా అని కార్యకర్తలు ఎప్పుడూ చర్చించుకుంటుంటారు.
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొదటి సభ అయిన ఇంద్రవెల్లి దండోరా విజయవంతం చేయడంలో పీఎస్సార్‌దే కీ రోల్. ఆ సమయంలో రాష్ర్టంలోని మెజార్టీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా కనిపించింది. కానీ ఇంద్రవెల్లి సభ సక్సెస్ ఆ పార్టీకే బూస్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను ఎవరూ ఊహించని విధంగా విజయవంతం కావడం కేవలం ప్రేమ్ సాగర్ రావు కృషితోనే సాధ్యమైందని పీఎస్సార్ అనుచరులు గర్వంగా చెప్పకుంటుంటారు. ఆయా కార్యక్రమాలతో జిల్లాలో పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు పీఎస్సార్.

పదేళ్ల తర్వాత రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పీఎస్సార్ కు సముచిత స్థానం లభిస్తుందని కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ పార్టీ కోసం కష్టపడిన పీఎస్సార్‌ను పక్కన పెట్టి.. మూడు సార్లు పార్టీలు మారిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌కు మంత్రి పదవి కట్టబెట్టడంపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేసిందేమిటో చెప్పాలంటున్నారు మంచిర్యాల నియోజకవర్గంలోని హస్తం పార్టీ కార్యకర్తలు. రెండు ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు మళ్లీ మంత్రి పదవి అప్పగించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకెన్ని రోజులు నెత్తిన పెట్టుకుంటుందని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలు అమలు చేయకపోవడంపై అసంతృప్తి తీవ్రమవుతున్నది. ఆర్థిక బలం, అధిష్టానం అనుకూలతే అర్హతలైతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నది.

ఒక కుటుంబం, మూడు టిక్కెట్లు, ఒక మంత్రి పదవి అంటే ప్రజలతోపాటు కార్యకర్తలకు పార్టీ అధిష్టానం ఇస్తున్న సందేశం ఏమిటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *