- రూ.31.50 లక్షలు వసూలు
- పురోహితుడికి శఠగోపం పెట్టిన నకిలీ విలేకరి
- మీడియా ముందు గోడు వెల్లబోసుకున్న బాధితుడు
- కేశవపట్నం ఠాణాలో ఫిర్యాదు
SRSP : ఎస్సారెస్పీలో పోయిన భూమికి పట్టా చేయించడంతో పాటు రూ. 90 లక్షల పరిహారం ఇప్పిస్తానంటూ ఓ నకిలీ విలేకరి పురోహితుడికి శఠగోపం పెట్టాడు. బాధితుడు కేశవపట్నంలో విలేకరులకు తన గోడు వెల్లబోసుకున్నాడు. అనంతరం కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి…
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామానికి చెందిన వైరాగ్యపు రాజమల్లయ్య పౌరోహిత్యం చేస్తుంటాడు. అతనికి తన స్వగ్రామంలో ఎడెకరాల వ్యవసాయం భూమి ఉంది. అందులో ఎకరం భూమి కొంత కాలంగా పహానీలో చూపించడం లేదు. ఈక్రమంలో 2023లో శంకరపట్నం మండలం తాడికల్కు చెందిన మాచర్ల రాజయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రాజమల్లయ్యతో తన భూమి గురించి మాచర్ల రాజయ్యకు వివరించాడు. ఆ భూమిని పహానీలోకి వచ్చేలా చేస్తానని నమ్మించాడు.
ఇందుకు కొంత ఖర్చు అవుతుందని ముందుగా రూ. లక్షకు పైగా వసూలు చేశాడు. రెవెన్యూ అధికారులు ఇచ్చారంటూ నకిలీ ప్రొసీడింగ్ కాపీ జిరాక్స్ను రాజమల్లయ్యకు ఇచ్చాడు. ఎస్సారెస్పీ కాలువ కింద పోయిన వ్యవసాయ భూములకు ప్రభుత్వం భారీగా పరిహారం ఇస్తున్నదని, ఈ లెక్కన తన భూమికిరూ. 96 లక్షల దాకా పరిహారం ఇప్పిస్తానని, తనకు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. అతడిని నమ్మిన రాజమల్లయ్య మాచర్ల రాజయ్య బ్యాంకు ఖాతాకు పోన్ పే, గూగుల్ పే, ఇతర అకౌంట్ల ద్వారా రూ. 31.50 లక్షల వరకు పలు విడుతల్లో చెల్లించాడు.
భూమి పట్టా, పరిహారం కోసం రోజుల తరబడి వేచి చూసినా పని పూర్తికాకపోవడంతో మాచర్ల రాజయ్యను బాధితుడు పలుమార్లు నిలదీస్తూ వచ్చాడు. దీంతో రాజయ్య కాన్పరెన్స్ కాల్స్ ద్వారా ఇతరులతో మాట్లాడిస్తూ అధికారులతో మాట్లాడించినట్లు నమ్మించాడు. తాను మోసపోయానని గ్రహించిన రాజమల్లయ్య పెద్ద మనుషుల సాయంతో నిలదీశాడు. దీంతో డబ్బులు తిరిగి ఇస్తానంటూ రాజయ్య ఓ తెల్ల కాగితంపై రాసి ఇచ్చాడు. డబ్బులు ఇవ్వకుండా రేపు మాపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాడు.
మంగళవారం కేశవపట్నం పోలీసులను ఆశ్రయించాడు. అత్యాశకు పోయి తాను తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి డబ్బులు రాజయ్యకు ఇచ్చానని, నమ్మితే విలేకరి ముసుగులో తనను నిలువునా ముంచాడంటూ బాధితుడు విలపించాడు. తనకు న్యాయం చేసి తన డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ వేడుకుంటున్నాడు.
-శెనార్తి మీడియా, శెంకరపట్నం :