alphores smart school
alphores smart school : మంచిర్యాల గోదావరి రోడ్డులోని అల్పోర్స్ స్మార్ట్ పాఠశాల

Alphores: అల్ఫోర్స్ పేరు చాలా.. అనుమతి అక్కర్లేదా?

  • విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వకున్నా పాఠశాల నిర్వహణ
  • మంచిర్యాలలోని గోదావరి రోడ్డులో ఓపెనింగ్ పర్మిషన్ లేకుండానే స్కూల్ నిర్వహణ
  • అన్నీ తెలిసినా పట్టించుకోని మంచిర్యాల డీఈవో
  • విద్యార్థుల జీవితాలతో చెలగాటం
  • ఆందోళనలో తల్లిదండ్రులు

Alphores: అల్ఫోర్స్ ఉత్తర తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థ. ఇంటర్, ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీ, తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో హైదరాబాద్ లాంటి మహానగంలోని కార్పొరేట్ విద్యా సంస్థలను సైతం అధిగమిస్తూ ఫలితాల్లో ముందుంటున్నామని సదరు విద్యా సంస్థ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు ఇస్తుంటారు. ఇదంతా నిజమేనని భావించి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు మంచి భవిష్యత్ కోసం డబ్బుకు వెనకాడకుండా అల్ఫోర్స్ లో చేర్పిస్తుంటారు. తమ పిల్లల భవిష్యత్ బాగుంటే చాలునని భావించే తల్లిదండ్రులు.. వాటి వెనక ఉన్న లొసుగులను మాత్రం చూడరు. పైపై మెరుగులు, ఏసీ క్యాంపస్ లు, పేపర్లు, టీవీలలో ఆకట్టుకునే అడ్వర్టైజ్ మెంట్లకు పేరెంట్స్ మాయలో పడిపోతున్నారు. టర్మ్ ఫీజుల కట్టలేదని పిల్లలను ఇంటికి పంపించిన కార్పొరేట్ విద్యాసంస్థలు సైతం లేకపోలేదు. పైపై మెరుగులతో మంచిర్యాలలో అల్ఫోర్స్ విద్యా సంస్థ చేస్తున్న ఓ ఘనకార్యం శెనార్తి మీడియా దృష్టికి వచ్చింది.

ఇదీ విషయం..
అల్ఫోర్స్ విద్యాసంస్థకు మంచిర్యాలలో రెండు బ్రాంచీలు ఉన్నాయి. అందులో ఒకటి మంచిర్యాల హైటెక్ సిటీ దగ్గర ఏసీ క్యాంపస్ ఉంది. మరొకటి గోదావరి రోడ్డులో అల్పోర్స్ స్మార్ట్ పేరిట పాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో దాదాపు 310 మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తున్నది. అయితే ఈ పాఠశాలకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ నుంచి అనుమతి రాలేదు. ఓపెనింగ్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, కొన్ని డాక్యుమెంట్లు లేవని స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ దస్ర్తాలను వెనక్కి పంపారు.

ఒక పాఠశాల నిర్వహించాలంటే ముందుగా ఓపెనింగ్ అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండా అల్ఫోర్స్ అధినేత మంచిర్యాలలోని గోదావరి రోడ్డులోని పాఠశాలను నిర్వహించడం గమనార్హం. అయితే ఈవిషయం కొంత మంది తల్లిదండ్రులకు తెలియడంతో తమ పిల్లల భవిష్యత్ ఏమిటని ఆందోళన చెందుతున్నారు.

పాఠశాలకు అనుమతులు లేని విషయమై సంబంధించి మంచిర్యాల డీఈవో యాదయ్యను శెనార్తి మీడియా వివరణ కోరగా అనుమతులు లేని విషయం వాస్తవమేనని తెలిపారు. ఆర్జేడీ నుంచి ఫైల్ వెనక్కి పంపారని పేర్కొన్నారు.

పేరుంటే సరిపోతుందా.. అనుమతులు అక్కర్లేదా?
తమ విద్యాసంస్థ కు ఉన్న బ్రాండ్ చాలునని అధినేత నరేందర్ రెడ్డి భావిస్తున్నారేమో. అనుమతులు తీసుకోవాల్సిన బాధ్యత లేదా ? విద్యార్థుల భవిష్యత్ ను పణంగా పెడతారా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *