- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
HOSTEL INSPECTION : విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, వారి లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం రాత్రి మంచిర్యాల పట్టణం సాయి కుంట ప్రాంతంలో గల వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి ఆయన సందర్శించారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ఏకాగ్రతతో చదివి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరి గోడ, అదనపు గదులు ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో భాగంగా డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచిందని, నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.

- వడ్డించి.. కలిసి భోజనం చేసి.. సామర్థ్యాలు తెలుసుకొని…
కలెక్టర్ కుమార్ దీపక్ హాస్టల్ లోని వంటశాల, భోజనం తయారీ విధానం, నిద్రిస్తున్న గదులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించడమే కాకుండా వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. అనంతరం విద్యార్థులను సబ్జెక్టుల వారిగా పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను పరిశీలించారు. శారీరక కార్యకలాపాలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి వసతి గృహంలోనే రాత్రి పడుకున్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :
