‘స్టంట్ డిజైన్’ విభాగానికి ప్రవేశం
Oscar Awards: సినిమా ప్రపంచంలో అత్యున్నత గుర్తింపుగా భావించే అకాడమీ అవార్డుల్లో మరో కీలక విభాగం ప్రవేశపెట్టబడింది. 100 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ, ‘స్టంట్ డిజైన్’కు ప్రత్యేకంగా అవార్డు ప్రకటించనున్నట్లు అకాడమీ అధికారికంగా వెల్లడించింది. ఈ విభాగంలో అవార్డులు 2028లో జరుగనున్న 100వ ఆస్కార్ వేడుకల నుంచి అందించనున్నట్లు తెలిపింది. 2027లో విడుదలయ్యే సినిమాలు ఈ కొత్త కేటగిరీకి అర్హత కలిగినవిగా పరిగణించబడతాయని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటన పోస్టర్లో భారతీయ చిత్రం RRRకి సంబంధించిన యాక్షన్ సీన్ను ఉపయోగించడంపై దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాల సరసన భారతీయ సినిమా ఉద్భవించడం గర్వకారణంగా భావిస్తున్నారు.
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ మార్పుపై హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “100 ఏళ్ల తర్వాత స్టంట్లకు గౌరవం దక్కడం ఎంతో సంతోషకరం. ఈ చారిత్రాత్మక అడుగు వేసిన అకాడమీకి ధన్యవాదాలు” అంటూ వ్యాఖ్యానించారు. RRR విజువల్ను పోస్టర్లో చూడడం తాను ఎంతో థ్రిల్తో చూసినట్లు తెలిపారు.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అందుకుంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో రూపొందిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీపై ఆసక్తికరమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, తదుపరి ఆస్కార్ కోసం ఇది పోటీ పడే అవకాశముందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
బాహుబలి సిరీస్, RRR చిత్రాల ద్వారా రాజమౌళి స్టంట్ సన్నివేశాల్లో సరికొత్త ప్రమాణాలను ఏర్పరిచినట్లు పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. తాజా సినిమా SSMB 29లో కూడా భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నాయని సమాచారం. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి, కొన్నివార్తల ప్రకారం ఐదు నిమిషాల యాక్షన్ సీన్ కోసమే రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, రాజమౌళి సినిమాకు మరోసారి ఆస్కార్ పురస్కారం అందే అవకాశం ఉందనే ఆశ cine అభిమానులలో కొత్త ఊరట నింపుతోంది.