సీఎండీ హెచ్చరిక
Singareni CMD: సింగరేణి సంస్థ చేపట్టిన వ్యాపార విస్తరణ ప్రాజెక్టుల అమలులో వేగం పెంచాలని, పనుల్లో జాప్యం జరిగిన పక్షంలో ఉపేక్షించబోమని సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అధికారులను స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవనంలో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సంస్థ చేపట్టిన సోలార్, పవన, జియోథర్మల్ విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, కీలక ఖనిజాలు, జాయింట్ వెంచర్లు, సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్, మిథనాల్ తయారీ వంటి 28 విభిన్న విస్తరణ ప్రాజెక్టులపై ఈ సమీక్ష జరిగింది. కొన్ని పనులు ప్రారంభ దశలో ఉండగా, మరికొన్ని ఒప్పందాలు కుదిరినవిగా, ఇంకొన్ని పరిశీలన దశలో ఉన్నవిగా సీఎండీ వెల్లడించారు.
వాటిని వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించిన బలరామ్, అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులలో మరిన్ని పురోగతులు కనిపించాల్సిన అవసరం ఉందని, వచ్చే 10 రోజుల్లో ప్రతీ పనిలో అభివృద్ధి స్పష్టంగా కనిపించాలని ఆదేశించారు. ఇకపై ప్రతీ వారం బొగ్గు ఉత్పత్తితో పాటు విస్తరణ ప్రాజెక్టులపై కూడా సమీక్ష జరుగుతుందని చెప్పారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సింగరేణి విస్తరణ పథకాలను ప్రోత్సహిస్తున్నాయని, అందువల్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రూఫ్టాప్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, కోల్ వాషరీలు, హైడ్రాలిక్ కన్వేయర్లు వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది.
ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ ఇ&ఎం సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పర్సనల్ గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.డి.ఎం. సుభాని, జీఎంలు మనోహర్, రాజశేఖర్ రావుతోపాటు సింగరేణి థర్మల్, సోలార్, సివిల్, రీసెర్చ్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగాలకు చెందిన 20 శాఖలాధిపతులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల/హైదరాబాద్