NEW ROR LAW : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంను, ఇందులో పొందుపరిచిన అంశాలను రైతులు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ (షాది ఖాన)లో భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్ డి ఓ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత, తహశిల్దార్ రఫతుల్లా లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. (ROR) ఈ చట్టం రైతులకు భూమి హక్కులు మరియు రికార్డులలోని లోపాలను సరిదిద్దడానికి, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు ముందు భూమి యొక్క పూర్తి సర్వే మరియు మ్యాప్ను సిద్ధం చేయడానికి మరియు సాదా టైటిల్ డీడ్ల కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు సమగ్ర విచారణ జరిపి పట్టా చేయడం జరుగుతుందని తెలిపారు.

భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా ముటేషన్ చేసి రికార్డులో నమోదు చేయడం జరుగుతుందని, పాసు పుస్తకాలలో భూమి పటం నమోదు చేయడం జరుగుతుందని, భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, భూధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు అవకాశం వంటి అంశాలను చేర్చనున్నట్లు ప్రకటించారు. భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంపై రైతులు (FARMERS) పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక మండలాన్ని ఎంపిక చేస్తామని, జూన్ 2 నాటికి అన్ని సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. సమస్యల పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించబడుతుంది. మిగిలిన మండలాల్లోని సమస్యలను ఆగస్టు నాటికి గుర్తించి పరిష్కరిస్తారు.
గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గ్రామస్థాయిలోని సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని, రైతులకు పట్టాభూమి, లావుని పట్టా, ఇతర రకాల భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ ఆదేశాలు, చట్ట ప్రకారం టైటిల్, స్వాధీనానికి సంబంధించిన సమస్యలు, కోర్టులో కొనసాగుతున్న కేసులు మినహా మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో పొందుపరిచిన అంశాలను రైతు ప్రయోజనం దిశగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :