- కొన్నది లేదు.. మిల్లులకు తరలించేది లేదు…
- కోత లేకుండా మిల్లుల్లో దిగడం కష్టమే…
- రైతులు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమే…
PADDY PROCUREMENT : మంచిర్యాల జిల్లాలో 2024-25 యాసంగి సీజన్ ధాన్యం సేకరణకు సంబంధిత శాఖ అధికారులు అంతా సిద్ధం చేశామని ప్రకటనలు చేసుకుంటున్నారు తప్పా అవి క్షేత్ర స్థాయిలో ఏ మాత్రం ఫలితాలివ్వడం లేదు. జిల్లా వ్యాప్తంగా 95 వేల 344 ఎకరాల సాధారణ సాగు కాగా 1,21,702 (దొడ్డు రకం 1,14,774, సన్న రకం 6,928 ) ఎకరాలలో వరి సాగయింది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 3 లక్షల 30 వేల 440 (దొడ్డు రకం 3,13,778, సన్న రకం 16,662) మెట్రిక్ టన్నులు వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంఛనా వేశారు. జిల్లాలో కోతలు ప్రారంభమై కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి చేరుతోంది.
జిల్లాలో మూడు ఏజెన్సీలు.. 321 కేంద్రాలు…
జిల్లాలోని రైతులు వరి పంట సాగు చేసి వారి అవసరాల కోసం 9,860 మెట్రిక్ టన్నుల వరకు వాడుకోవడం లాంటివి మినహాయిస్తే కొనుగోలు కేంద్రాలకు 3 లక్షల 30 వేల 440 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంఛనా వేశారు. ఈ ధాన్యాన్ని మూడు ఏజెన్సీల పరిధిలోని 321 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో డీఆర్డీఏ (ఐకేపీ) ఏజెన్సీకి 194 , పీఏసీఎస్ కు 121, మెప్మా ఏజెన్సీకి 6 సెంటర్లను కేటాయించారు. వీటి ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు.

పేరుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు…
జిల్లాలో 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. కాని అవి పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలుగా చెలామణి అవుతున్నాయి తప్ప క్షేత్ర స్థాయిలో కొనుగోళ్లు జరుగడం లేదు. ఓవైపు మబ్బులు వస్తుండటం, అక్కడక్కడ జల్లులు పడుతుండటం.., మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు… జిల్లాలో దాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత శాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు నేరుగా సంబంధిత శాఖ అధికారులకే ఫిర్యాదులు చేస్తున్నారు.
కొన్నది లేదు.. మిల్లులకు తరలించేది లేదు…
హాజీపూర్ మండలం కర్ణ మామిడి, హాజీపూర్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభించలేదు. పేపర్లలో వార్తలు వచ్చిన వెంటనే హడావిడి చేస్తున్న అధికారులు రైతులకు ఏమాత్రం ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. రైతులు నేరుగా జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకు ఈ కేంద్రాల నుంచి ధాన్యం కొన్నది లేదు.., మిల్లులకు తరలించినది లేదు…
కోత లేకుండా మిల్లుల్లో దిగడం కష్టమే…
ఇటీవల గుడిపేట, నంనూరు ఐకేపీ కేంద్రాల నుంచి నాలుగు లారీల ధాన్యం అందుగుల పేటలోని ఒక మిల్లుకు పంపించారు. ఇంత వరకు బాగానే ఉన్నా లారీకి పాతిక నుంచి 25 బస్తాల కోత లేకుండా దించేది లేదని నాలుగు రోజులు మిల్లు వద్దనే లారీలను ఆపి వేశారు. ఒక వైపు లారీల యాజమానులు అన్ లోడ్ చేయించాలని రైతులపై ఒత్తిడి చేయడం, మరోవైపు సెంటర్ నిర్వాహకులు రైతులను కోతకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడంతో చేసేదేమి లేక రైతులు కోతకు ఒప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడే బస్తాకు రెండు కిలోలు కోత విధిస్తుంటే రానున్న రోజుల్లో క్వింటాలుకు 15 నుంచి 20 కిలోలు కోత విధించే అవకాశాలున్నాయని, అధికారులు మిల్లర్లకు వత్తాసుపలుకకుండా రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ప్రకటనలకే పరిమితమవుతున్న అధికారులు…
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని చెబుతున్న అధికారులు క్షేత్ర స్థాయిలో అవి ఏమేరకు జరుగుతున్నాయో పరిశీలించడంలో పూర్తిగా విఫలమయ్యారు. జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశిస్తున్నా అవి ఏమాత్రం అమలు కావడం లేదు. దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది రైతులు చేసేదేమి లేక తక్కువ ధరకు సమీప మిల్లులకు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శెనార్తి మీడియా, మంచిర్యాల ప్రతినిధి :