- మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీముల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- ఆన్లైన్ మోసాలపై రామగుండం సీపీ శ్రీనివాస్ సూచన
Cyber Crimes : సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ (Ramagundam Police Commissioner)ఎం. శ్రీనివాస్ సూచించారు. సైబర్ నేరగాళ్లు ప్రజల బలహీనతలను ఉపయోగించి కొత్త కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట కొత్త కొత్త స్కీములతో మభ్యపెడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
క్రిప్టో కరెన్సీ, ఆగ్రో గార్మెంట్స్, హెర్బల్ అండ్ హెల్త్, గృహ పరికరాల వంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మిస్తూ ప్రజల నుంచి డబ్బు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. విలాసవంతమైన జీవితం, సొంత ఇంటి కల, విదేశీ యాత్రలతో పేరిట ప్రలోభాలకు గురి చేస్తారని పేర్కొన్నారు. ముందుగా ప్రాథమిక సభ్యత్వం పేరిట డబ్బు వసూలు చేసి, మరి కొంత మందిని చేర్పించాలంటూ ఉత్సాహపరుస్తున్నారని వెల్లడించారు.
ప్రజలు ఇలాంటి మోసపూరిత ప్రకటనల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద లింకులు, ఏపీకే(apk) ఫైళ్లు, అనధికారిక అప్లికేషన్లు డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. బాధితులు రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరాలను అరికట్టడంలో అప్రమత్తతే ఆయుధమని సీపీ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల/గోదావరిఖని