కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
Bhubharathi: రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ‘భూభారతి’ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్, కొత్తపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆమె మాట్లాడారు.
ధరణి చట్టంలో పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారానికి మార్గం లేక పోయినప్పటికీ, భూభారతిలో వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేపడతామని వివరించారు.
ధరణిలో ఉన్న 33 మాడ్యూల్స్ వల్ల రైతులు భూసంబంధిత సమస్యల పరిష్కారానికి నానా ఇబ్బందులు పడుతున్నారని, నూతన చట్టంతో మాత్రం స్పష్టమైన రెండంచెల అప్పీళ్ల వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించారు. భూమిపై హక్కు సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, భూమి ట్రిబ్యునల్ వరకూ దశలవారీగా అప్పీల్ చేసే అవకాశం ఉందన్నారు.
భూభారతి చట్టంతో అబాదీ, వ్యవసాయేతర భూములు, నివాస స్థలాలకు కూడా హక్కులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో గందరగోళం లేకుండా భూములకు ‘భూదార్’ నంబర్ కేటాయిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో ప్రతి సంవత్సరం భూ మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్, ప్రభుత్వ భూముల రికార్డులను అనుసంధానంగా నిర్వహిస్తామని వివరించారు.
భూభారతి ప్రవేశానికి ముందు భూ దరఖాస్తుల పరిష్కార అధికారం కలెక్టర్లకే పరిమితమై ఉండగా, ఇప్పుడు తహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు పంపిణీ చేయడం వల్ల పెండింగ్ దరఖాస్తులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు. రైతులు నిరాశ చెందకుండా, తమ సమస్యలు త్వరితగతిన పరిష్కరించబడతాయని భరోసా ఇచ్చారు.

భూభారతి రైతులకు రక్షక చట్టం: కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు అండగా నిలుస్తుందని భూభారతి చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ధరణి చట్టం వల్ల రైతులు కోర్టుల చుట్టూ తిరిగి నానా అవస్థలు పడాల్సి వచ్చిందని ఆరోపించారు. ధరణి కారణంగా కొందరు నాయకులు వందల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు.
తనకూ ధరణి పోర్టల్లో 20 గుంటల భూమి తక్కువగా నమోదైన అనుభవం ఉందని చెప్పిన ఆయన, రైతుల భూసమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం సమర్థమైన మార్గం అని పేర్కొన్నారు. ఈ చట్టంతో తహసీల్దార్, ఆర్డీవోల స్థాయిలోనే సుమారు 80 శాతం సమస్యలు పరిష్కారం కానున్నాయని వివరించారు. రైతు రాజుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు రాజు, రాజేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, కరీంనగర్
