Karimnagar CP
Karimnagar CP

Karimnagar CP: నేరస్తులపై ఉక్కుపాదం మోపాలి

  • కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
  • కమిషరేట్‌లో నెలవారీ నేర సమీక్ష సమావేశం

Karimnagar CP: నేరస్తులపై ఉక్కుపాదం మోపాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలయం సూచించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెలవారీ నేర సమీక్ష సమావేశం శనివారం స్థానిక కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు. సీపీ గౌష్ ఆలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పోలీసులు నేరాల నివారణపై చర్చించారు. అధికారులకు అనేక సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు.
ప్రభుత్వ భూములు ఆక్రమించే వారిపై, అక్రమ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. చిట్ ఫండ్ మోసాల సంఖ్య పెరుగుతుండటంతో బాధితులకు న్యాయం జరగేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని స్టేషన్లను తరచూ పర్యవేక్షించాలని చెప్పారు. డివిజన్ వారీగా ఏసీపీలు నెల నెలా సమీక్షలు నిర్వహించాలని, సీసీసీ ఫిర్యాదులను త్వరితంగా పరిష్కరించాలన్నారు.

శాంతిభద్రతల పరంగా సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సామాగ్రి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఎస్‌హెచ్‌ఓలుగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు స్టేషన్ నిర్వహణను మెరుగుపర్చాలని, పరిశుభ్రత, రికార్డు నిర్వహణలో లోపం లేకుండా చూడాలని చెప్పారు.
సీసీటీఎన్ఎస్‌లో కేసుల వివరాలను నమోదు చేయాలని, పెండింగ్ కేసులను సమీక్షించి త్వరగా పరిష్కరించాలన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను నమోదు చేసి, వదిలివేసిన వాహనాల వేలం కోసం పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

బీట్, పెట్రోలింగ్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వంటి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. డివిజన్‌ను సెక్టార్లుగా, సబ్‌సెక్టార్లుగా విభజించి, బాధ్యతలను స్పష్టంగా అప్పగించాలని చెప్పారు. ప్రజలకు దగ్గరగా ఉండేలా పోలీసు సేవలను అందించాలని స్పష్టం చేశారు.
రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. గంజాయి, ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, పేకాట స్థావరాలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో అవగాహన పెంచాలని సూచించారు.

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచాలని, పెండింగ్ వారెంట్లను అమలు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై చర్చించి ప్రమాద ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి (టౌన్), వి. మాధవి (హుజూరాబాద్), యాదగిరి స్వామి (ట్రాఫిక్), శ్రీనివాస్ (ఎస్‌బి), వేణుగోపాల్ (సీటీసీ)లతో పాటు అన్ని విభాగాల ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Karimnagar Police
Karimnagar Police

– శెనార్తి మీడియా, కరీంనగర్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *