- నియంత్రణకు టాస్క్ ఫోర్స్ టీమ్ లు ఏర్పాటు చేయాలి
- సంక్షేమ పథకాల అమలులో అలసత్వం చూపితే చర్యలు
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క
- ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వానకాలం సాగు సన్నద్ధత పై అధికారులతో సమీక్ష
Minister Seethakka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాల నిరోధానికి ఉక్కపాదం మోపాలని, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, వానకాలం పంటల సాగ సన్నద్ధత పై అధికారులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, వినోద్, రామారావు పటేల్, ఎమ్మెల్సీలు దండే విఠల్, మల్కా కొమురయ్య, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర చైర్మన్ తిరుపతి తో పాటు నాలుగు జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. భూ భారతితో రైతుల కష్టాలను తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వం కాస్తూ కాలం తీసివేసి రైతులను కూలీలను చేసిందని విమర్శించారు. ట్రైబల్ ఏరియాలో ఉట్నూర్ ఐటీడీఏకు 5వేల ఇందిరమ్మ ఇండ్ల కేటాయించామని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ఫర్టిలైజర్లు కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు స్పష్టం చేశారు. దీని కోసం జిల్లాలో టాస్క్ పోర్స్ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలులో అలసత్వం చూపితే చర్యలు తప్పవని అధికారులను మంత్రి హెచ్చరించారు.
అనంతరం అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించే మిల్లెట్, పీనట్ చిక్కీలను కేంద్రాల సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల