- జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
LOUIS BRAILLE : అవిటి తనాన్ని ఆత్మ స్థైర్యంతో ఎదుర్కొని పోరాడాలని, ఎందరో అంధ దివ్యాంగులు తమ వైకల్యాన్ని అధిగమించి తాము ఎంచున్న రంగాలలో విజయం సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో శనివారం జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దుర్గాప్రసాద్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్ వీరు లతో కలిసి హాజరై అంధ దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు వైకల్యం ఉందని నిరాశ పడకుండా వైకల్యాన్ని ఎదురించి ఉన్నత స్థాయిలో నిలిచిన వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. లూయి బ్రెయిలీ అంధులకు అందించిన సేవలు చిరస్మరణీయమని, లూయి బ్రెయిలీ అందించిన బ్రెయిలీ లిపి ద్వారా ఎంతో మంది అంధులు ఉన్నత స్థానాలలో నిలిచారన్నారు. వైకల్యం అనేది శరీరానికి మాత్రమేనని మనసుకు, ఆలోచనకు కాదని, పిల్లలు అందరు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, ఎంచుకున్న లక్ష్యాన్ని అధిగమించి మరింత మందికి స్ఫూర్తిగా నిలువాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఫర్జానా బేగం, డిసిపిఓ ఆనంద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులతో కలిసి లూయిస్ జయంతి కేక్ కట్ చేస్తున్న అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్
- శెనార్తి మీడియా, మంచిర్యాల