- భర్త కుటుంబ సభ్యులే లక్ష్యంగా దాడి…
- ప్రాణాలు దక్కించుకునేందుకు పోలీస్ స్టేషన్ కు పరుగులు
- ముందు సమాచారం ఇచ్చినా పట్టించుకోని పోలీసులు
Ganja Batch : దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య, భర్తల మధ్య జరిగిన పంచాయతీలో గాంజా మత్తులో అమ్మాయి తరుపు వారు దాడి చేసిన ఘటనలో అబ్బాయి తరుపు వారు తీవ్ర గాయాలకు గురైన సంఘటన బుధ వారం చోటు చేసుకుంది. బాధితుల, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దండేపల్లి మండలం వెల్గానూర్ గ్రామానికి చెందిన చుంచు లక్ష్మీనారాయణ కూతురు తిరుమలకు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ముత్యం లక్ష్మయ్య కుమారుడు కమలాకర్ తో పదేండ్ల కిందట వివాహం జరిగింది. పిల్లల విషయంలో ఇరువురి మధ్య గొడవ పోలీస్ స్టేషన్ కి చేరింది.

పక్కా ప్లాన్ తో భర్త కుటుంబ సభ్యులపై దాడి…
దండేపల్లి పోలీస్ స్టేషన్ పక్కన బుధ వారం ఇరు కుటుంబాల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరుగుతుండగానే అమ్మాయి తరుపు వారు మూడు వాహనాలలో కొంత మందిని దింపి అబ్బాయి కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు. గాంజా మత్తులో ఉన్న వారు పంచాయతీ జరుగుతున్న సమయంలోనే గొడవలకు తేరలేపే ప్రయత్నం చేయగా అక్కడున్న వారు అడ్డుకొని పంపించారు. అమ్మాయి కుటుంబ సభ్యులు రహస్యంగా సెల్ ఫోన్ లలో భర్త కుటుంబ సభ్యుల ఫోటోలు వారికి షేర్ చేయడంతో పంచాయతీ విషయం పోలీస్ స్టేషన్ లో వివరించేందుకు వెళుతున్న క్రమంలో ఒక్క సారిగా కమలాకర్ కుటుంబ సభ్యులపై రాళ్లు, కత్తులతో దాడి చేసి గాయపర్చారు. అడ్డుకున్న వారిపై సైతం విచక్షణ రహితంగా కొట్టారు.

ప్రాణాలు దక్కించుకునేందుకు పోలీస్ స్టేషన్ కు పరుగులు
అమ్మాయి తరుపు బంధువులు ముందస్తు రచించుకున్న పక్కా ప్లాన్ తోనే కొంత మంది గూండాలను తీసుకువచ్చి అబ్బాయితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కత్తులు, రాళ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. ప్రాణ భయంతో కమలాకర్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు. గాంజా మత్తులో ఉన్న యువకులు పోలీస్ స్టేషన్ వరకు వెంటాడారు. పోలీసులు వచ్చినా వారి దాడి ఆపకపోవడం, పోలీసులు నిరోదించే ప్రయత్నం చేయకపోవడం పట్ల బాధితులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ముందు సమాచారం ఇచ్చినా పట్టించుకోని పోలీసులు - కుటుంబ సభ్యులు
పంచాయతీ జరుగుతున్న క్రమంలో చుంచు లక్ష్మీ నారాయణ, అక్కల శ్రీనివాస్ లు చుంచు జగదీశ్, నరేష్ ల సహాయంతో మూడు వాహనాలలో గుండా ముఠాను దింపినట్లు, చంపే ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయాన్ని తెలిపినా పట్టించుకోలేదని కమలాకర్ కుటుంబ సభ్యులు వాపోయారు. పక్కా ప్లాన్ తోనే మాపై కిరాయి గూండాలతో హత్యా ప్రయత్నం చేశారని, మాకు ప్రాణ హానీ ఉందని, పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పందించి తమకు న్యాయం చేయాలని, దీనికి కారకులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఈ విషయమై దండేపల్లి ఎస్సై ఉదయ్ కిరణ్ ను సంప్రదించగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని, గాయాలకు గురైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించామన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల