- కేసీఆర్ హయాంలో 2800 మందికి పట్టాలు
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా కానరాని చర్యలు
- రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఫైర్
- బీఆర్ఎస్ నాయకులతో కలిసి అరుణక్కనగర్లో పర్యటన
- ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వెన్నంటి ఉంటామని స్పష్టం
Nadipally Divakar Rao : సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఎప్పుడు ఇస్తుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ ఏడో వార్డు ఆరుణక్కనగర్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్, కార్యకర్తలతో కలిసి దివాకర్ రావు సోమవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లడారు. ప్రజలతో అనుబంధాలు కొనసాగించడంతో పాటు వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చూపడమే పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
కేసీఆర్ హయాంలోనే పట్టాలు
2004, 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ శ్రీరాంపూర్ ప్రాంతంలోని సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో దాదాపు 2800 మంది ప్రజలకు పట్టాలు మంజూరు చేశామని గుర్తుచేశారు.100 గజాల స్థలాలను ఉచితంగా ఇచ్చి, ఎక్కువ గజాలున్న స్థలాలకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం డబ్బులు తీసుకుని పట్టాలు ఇచ్చారని వివరించారు.
సింగరేణి ప్రాంతం అభివృద్ధి
పట్టాల ద్వారా ప్రజలు ఇళ్లను నిర్మించుకునే అవకాశం పొందారని, ఇది కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమైందని దివాకర్ రావు అభిప్రాయపడ్డారు. మరో 1000 మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. శ్రీరాంపూర్ కృష్ణ కాలనీ, ఆర్కే-6 ప్రాంతాల్లో పట్టాలు మంజూరు చేయాలని అప్పట్లో సీఎంకి సూచించామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాల మంజూరు పై ఏమాత్రం చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
నస్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 25 కోట్లు
నస్పూర్ మున్సిపాలిటీకి కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ. 25 కోట్లు మంజూరు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను రద్దు చేసిందని నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. నస్పూర్ మున్సిపాలిటీకి మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు
సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కేసీఆర్ ఘనతేనని పేర్కొన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని సింగరేణి ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నస్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న, సెక్రటరీ మెరుగు పవన్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, ముక్కెర వెంకటేశ్, నాయకులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
