- 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారి ఇతర రాష్ట్రంలో…
- నేడు ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి
- సంవత్సరానికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి… సీఎండీ బలరామ్
NAINI COAL MINES : సింగరేణి యాజమాన్యం తెలంగాణలో బొగ్గును వెలికితీస్తూనే మరోవైపు పక్క రాష్ట్రాలలో అడుగు పెట్టింది. ఇందు కోసం ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు బ్లాకు కోసం 2,255 ఎకరాల భూమి సేకరించింది. ఇందులో 1,935 ఎకరాల అటవీ భూమి కాగా 320 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూమి ఉంది. తెలంగాణలో ఉన్న 17 బొగ్గు గనులకన్నా ఇది పెద్ద గని కానుంది. 38 సంవత్సరాల పాటు ఈ నైనీ గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు తవ్వితీయడానికి సింగరేణి సంస్థ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

13 దశాబ్దాల చరిత్రలో తొలిసారి ఇతర రాష్ట్రంలో…
సింగరేణి సంస్థ 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు తవ్వకాన్ని ప్రారంభించనుంది. ఒడిశా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తి కొనసాగించనుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమై బొగ్గు గనులు నిర్వహిస్తున్న సింగరేణి ఇప్పుడు నైనీ బొగ్గు బ్లాక్ ద్వారా ఇతర రాష్ట్రాల్లోకి అడుగు పెట్టడం ఒక చరిత్రాత్మక ఘట్టంగా పేర్కొనవచ్చు.

నేడు ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి…
2016, మేలో నైనీ బొగ్గు బ్లాకుని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణికి కేటాయించింది. అన్ని రకాల అనుమతులు సాధించి, గనిలో తవ్వకం ప్రారంభించడానికి తొమ్మిదేళ్ళ సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేక చొరవ చూపుతూ అప్పటి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని, ప్రస్తుత బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తులు చేశారు. అంతే కాకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించి ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ, సంబంధిత అధికారులతోనూ సంప్రదింపులు జరిపి గని ప్రారంభానికి మార్గం సుగమం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లనే సింగరేణికి అతిపెద్ద బొగ్గు బ్లాక్ లభించింది. ఈ బ్లాక్ ని ఈ 16వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
రోడ్డు మార్గంగా రవాణా…
నైనీ బొగ్గు గనిలో మేలైన జీ – 10 రకం నాణ్యమైన బొగ్గు లభించనుంది. ఓవర్ బర్డెన్ తొలగించడానికి, బొగ్గు తవ్వకానికి, బొగ్గు రవాణాకు సంబంధించి సింగరేణి సంస్థ ఇప్పటికే కాంట్రాక్ట్ అప్పగించింది. ఉత్పత్తి చేసే బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని జరపడ రైల్వేసైడింగ్ కు రవాణా చేయనుంది. అక్కడ నుంచి వినియోగదారులకు సరఫరా చేయనుంది. మరో వైపు ఈ ప్రాంతంలో గల ఇతర బొగ్గు కంపెనీలతో కలిసి ఒక ప్రత్యేక 60 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించడం కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది మరో మూడేండ్లలో పూర్తయ్యే అవకాశాలున్నాయి.

సంవత్సరానికి కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి… బలరామ్ నాయక్, సింగరేణి సీఎండీ
నైనీ బొగ్గు బ్లాకులో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకుంటే ఏడాదికి 10 మిలియన్ టన్నుల ( కోటి టన్నుల) బొగ్గు ఉత్పత్తి కానుంది. ఇలా ఏడాదికి కోటి టన్నుల చొప్పున 38 సంవత్సరాల పాటు ఈ గని నుంచి బొగ్గు తవ్వి తీయనున్నాం. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో ఒక టన్ను బొగ్గు తవ్వి తీయడానికి సగటున 12 టన్నుల ఓవర్ బర్డెన్ (పై మన్ను) తొలగిస్తుండగా నైనీ గనిలో మాత్రం టన్ను బొగ్గు తీయడానికి కేవలం రెండున్నర క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తీస్తే సరిపోతుంది. ఇది సింగరేణికి లాభదాయకం.
– శెనార్తి మీడియా, సింగరేణి ప్రతినిధి