రూ. 5 వేల కోట్ల అవినీతి నిర్ధారణకేనా రహస్య ఆదేశాలు?
SIngareni: ‘‘ఒకే కుటుంబం – ఒకే లక్ష్యం – ఒకే గమ్యం’’ అంటూ పరస్పర విశ్వాసం నినాదంగా నడుస్తున్న సింగరేణి సంస్థలో తాజాగా జారీ చేసిన గోప్యత ఆదేశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ గోప్యత పాటించాలని యాజమాన్యం జారీ చేసిన తాజా ఉత్తర్వులు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా సింగరేణిలో రూ. 5 వేల కోట్ల అవినీతి వ్యవహారాలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ జరుపుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ గోప్యత ఆదేశాలు వెలువడినట్లు ఉద్యోగ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయనే భయంతోనే యాజమాన్యం ఈ ఆదేశాలను జారీచేసిందని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాధనం వినియోగంలో పారదర్శకత, జవాబుదారీ తత్వాన్ని ప్రతిపాదించాల్సిన ప్రభుత్వ సంస్థలయినప్పటికీ, సింగరేణి యాజమాన్యం మాత్రం గోప్యత పేరుతో రహస్య పాలనకు పాల్పడుతోందన్న విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఎవరైనా సంస్థ పరంగా సమాచారం బహిర్గతం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని యాజమాన్యం సూచించినట్లు తెలిసింది.
‘‘పారదర్శక పాలనను వాగ్ధానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కింద నడుస్తున్న సింగరేణిలో ఈ గోప్యతా ఆదేశాలు అసలు ఏ ప్రయోజనానికి?’’ అంటూ కార్మిక వర్గం ప్రశ్నిస్తోంది. అవినీతి దాకా వెళ్లే నిర్ణయాలు, గోప్యత ముసుగులో జరిగే లావాదేవీలే దీనికి కారణమని వారు అంటున్నారు.
సమాచార హక్కు చట్టం అమలులో ఉన్న సమయంలో ఈ రహస్య ఆదేశాలు చట్టపరంగా కూడా నిలవవని, అవి తిరోగమనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పారదర్శకత పేరుతో బయటకు మాటలు, లోపల గోప్యత అంటూ చీకటి పాలన సాగిస్తే సంస్థ పతనమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇంటి దొంగలను కాపాడటానికేనా గోప్యతా ఆదేశాలు అంటూ కార్మిక వర్గం ప్రశ్నిస్తోంది. రూ. 5 వేల కోట్ల అవినీతి ఆరోపణలే ఈ రహస్య ఉత్తర్వులకు నేపథ్యమై ఉండొచ్చని ఉద్యోగుల్లో అభిప్రాయంగా వినిపిస్తోంది.
– శెనార్తి మీడియా, సింగరేణి ప్రత్యేక ప్రతినిధి