- మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్
- జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో పోలింగ్ కేంద్రాల పరిశీలన
DCP Bhaskar: మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు విజయోత్సవాలు, ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు, డీజేలకు అనుమతి లేదని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ స్పష్టం చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తిగా అమల్లోనే కొనసాగుతుందని వెల్లడించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా సాగేందుకు భద్రతా చర్యలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఈ క్రమంలో జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి, మందమర్రి మండలాల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాల వెల్లడి సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.

ఎటువంటి అంతరాయం లేకుండా శాంతిభద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించిన డీసీపీ, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ నాయకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల
