- నిలిచిన గుండ్లపల్లి- పొత్తూరు డబుల్ రోడ్డు పనులు
- కంకరపోసి వదిలిన కాంట్రాక్టర్
- రాకపోకలకు అంతరాయం
- ప్రమాదాలకు గురవుతున్న ప్రయాణికులు, రైతులు
- ఎమ్మెల్యే కవ్వంపల్లిని అడ్డుకునేందుకు యత్నం
- జంగపల్లిలో గ్రామస్తుల రాస్తారోకో
Jangapally: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి పొత్తూరు వరకు మంజూరైన డబుల్ రోడ్డు పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కంకరపోసి వదిలివేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ దారి గుండా తమ పొలాలకు వెళ్లేందుకు కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాత్రి వేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతున్నది. వాహనదారులు, ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఏడాది నుంచి పనులు నిలిచిపోయినా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పట్టించకోవడం లేదు. ఈ దారి గుండా ఉన్న ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. సోమవారం ఈ దారి గుండా ఎమ్మెల్యే కవ్వంపల్లి వస్తున్నాడని తెలిసి మండలంలోని జంగపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా గ్రామస్తులంతా ఏకమయ్యారు. అయితే ఎమ్మెల్యే ఆ దారి గుండా రాకపోడంతో అక్కడే ధర్నాకు దిగారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. పనులు పూర్తి చేయించకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

– శెనార్తి మీడియా, గన్నేరువరం