– “నీటి బిందువు – జలసింధువు” కార్యక్రమం హైలైట్…
– 675 హెక్టార్లలో 40 లక్షల మొక్కల నాటే లక్ష్యం…
FESTIVAL IN SINGARENI : సింగరేణి సంస్థ వర్షాకాలం ప్రారంభాన్ని పురస్కరించుకొని జూన్ 1వ తేదీ నుంచి వన మహోత్సవ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ప్రారంభించనుంది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ (C&MD N. BALRAM NAYAK) ఓ ప్రకటన విడుదల చేశారు. వన మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మొత్తం 675 హెక్టార్ల విస్తీర్ణంలో 40 లక్షల మొక్కలు నాటేందుకు సంస్థ చర్యలు తీసుకుంది. మొక్కల సంరక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “నీటి బిందువు – జలసింధువు” కార్యక్రమంలో భాగంగా 62 మినీ చెరువుల (SMALL PONDS) నిర్మాణం చేపట్టగా, వాటిలో 48 చెరువుల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఎన్. బలరామ్ వెల్లడించారు. మిగిలిన పనులు కూడా వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జీఎంలు, అటవీ, పర్యావరణ శాఖలతో సమీక్ష నిర్వహించిన ఆయన, వన మహోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించాలని సూచించారు. మొక్కల నాటిలో కార్మికులు, స్థానిక ప్రజల భాగస్వామ్యం కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు.

- భూగర్భజలాల పెంపుదల దిశగా చర్యలు…
భూగర్భజలాల స్థాయిని మెరుగుపర్చే లక్ష్యంతో మొత్తం 105 చెరువుల నిర్మాణం, పూడికతీత పనులు చేపట్టగా, ఇప్పటివరకు 43 చెరువుల్లో పూడికతీత పూర్తయింది. ఈ పనులలో కట్టల నాణ్యత, బలానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిఎండి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ పిపి కె. వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.డి.ఎం. సుభాని, అటవీశాఖ సలహాదారులు మోహన్ పరిగేన్, ఇతర అధికారులు, ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :