- బోర్డు తిప్పేసిన జువెలరీ షాప్ యజమాని
- గోదావరిఖనిలో వెలుగు చూసిన మోసం
- లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
Escape Businessman:నలభై ఏళ్ల పరిచయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మనవాడేలే అని అక్కున చేర్చుకున్నారు గోదావరిఖనిలోని సింగరేణి కార్మికులు. వాళ్ల నమ్మకమే ఆ వ్యాపారి మోసానికి పెట్టుబడిగా మారింది ఎప్పటి నుంచి పుట్టిందో గాని ఈ దుర్బుద్ధి.. ఒక్కసారిగా బోర్డు తిప్పేసి ఉదాయించాడు ఓ నగల వ్యాపారి. బంగారం షాపు యాజమాని బోర్డు తిప్పేసి పరారైన సంఘటన సంచలనం సృష్టించింది.
స్థానిక లక్ష్మీ నగర్ కు చెందిన శ్రీనాథ్ జువెలరీ యాజమాని తానాజీ జాదవ్. దాదాపు 40 సంవత్సరాల క్రితం గోదావరిఖనికి వలస వచ్చాడు. సింగరేణిలో పనిచేసే కార్మికులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వారి నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్నాడు. వారి వద్ద నమ్మకంగా ఉన్నట్టు నటిస్తూ కొద్దికొద్దిగా సింగరేణి కార్మికుల నుంచి అప్పులు తీసుకున్నాడు. అలా తీసుకున్న ఆ అప్పులతో నగల వ్యాపారం మొదలు పెట్టాడు. బొగ్గు బాయిలోకి వెళ్లే కార్మికులు బ్యాంకులకు వెళ్లలేరనే విషయాన్ని గుర్తించాడు. కార్మికుల నుంచి తీసుకున్న అప్పులకు సమయానికి బ్యాంకు వడ్డీ కంటే కొంచెం ఎక్కువగా ఇస్తూ నమ్మిస్తూ వచ్చాడు. ఇలా కొన్నేళ్లుగా తన దందాను కొనసాగిస్తూ వస్తున్నాడు.
ఈజీ మనీనే దుర్బుద్ధికి దారి తీసిందా?
తానాజీ సంపాదనను చూసి అతని కుమారులు ఈజీ మనీకి అలవాటుపడినట్లు సమాచారం. తండ్రి సంపాదనను చూసి కుమారులు చెడు అలవాట్లకు లోనైనట్లు స్థానికులు చెబుతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము కాకపోవడం, రోటేషన్ మనీ చేతి నిండా కనిపించడంతో ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు తెలిసింది. కొడుకులు చేస్తున్న ఘనకార్యం తండ్రికి తెలిసినా వారించలేకపోయాడు. వారి జల్సాలకు తండ్రి కూడా అడ్డు చెప్పకపోవడంతో కుమారులు మరింత రెచ్చిపోసాగారు. కొడుకుల జల్సాల కారణంగా కుటుంబం వచ్చిన లాభంతో పాటు సంపాదించిన సొమ్మంతో హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఎలాగూ చెప్పింది నమ్మే సింగరేణి కార్మికులు ఉండడంతో అందిన కాడికల్లా మరిన్ని అప్పులు చేసుకుంటూ వచ్చారు. సంపాదించిన డబ్బులు అయిపోవడం, అప్పులు పెరిగిపోయిన విషయం మెల్ల మెల్లగా ఒక్కొక్కరికీ తెలుస్తూ వచ్చింది. కొద్ది రోజులు అప్పులు ఇచ్చిన వారు అడుగుతూ వస్తుండడంతో రేపుమాపు అంటూ దాట వేస్తూ వచ్చాడు. అసలు విషయం బాకీలు ఇచ్చిన వాళ్లకు తెలిసే సరికి సదరు వ్యాపారి గోదావరిఖని నుంచి కూడాయించాడు.
మూడో కంటికి తెలియకుండా ఆస్తులు అమ్మేసి..
సదరు వ్యాపారికి ఆస్తులు ఉండడంతో ఇచ్చిన డబ్బు ఎటు పోతుందిలే తమలో తాము సర్ది చెప్పుకున్నారు కార్మికులు. కానీ ఆ వ్యాపారి పక్క స్కెచ్ వేసుకొని ముందుగానే తన ఆస్తులను మూడో కంటికి తెలియకుండా అమ్మేసుకున్నాడు. ఈ విషయం అప్పులు ఇచ్చిన వారికి తెలియడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు తమకు దిక్కేదని రోదిస్తున్నారు.

పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ఒక్కసారిగా నగల వ్యాపారి తానాజీ జాదవ్ పరారవడంతో బాధితులు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం లక్ష్మీనగర్ లో విచారణ చేపట్టారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

వ్యాపారి సంబంధికులైనా అనుమానాలు?
అయితే వ్యాపారికి సంబంధించిన రక్తసంబంధీకులు కూడా ఇక్కడే ఇదే వ్యాపారం చేస్తూ ఉండడంతో వారిపైనా బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లోలోపల ఇంత జరుగుతుున్నా వారికి తెలియకుండా ఉండదని బాధితులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ వాడి కోసం పదుల సంఖ్యలో కార్మికులను మోసం చేస్తున్నా చూస్తూ ఉండడంపై మండిపడుతున్నారు. ఈ ఉడాయింపులో వారికి కూడా ఏమైనా భాగస్వామ్యం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సుమారు రూ. 10 కోట్లకు మించి అప్పు ఉన్నదని తెలుస్తున్నది.

-శెనార్తి మీడియా, గోదావరిఖని